Chandrababu CID : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒకేసారి మూడు సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కుంభకోణం, ఇసుక పాలసీ కేసుల్లో.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలానే వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. చంద్రబాబు నేసు సీఐడీ ఆఫీస్ లకు వెళ్ళి పూచీకత్తును సమర్పించనున్నారు. అయితే ఈ కేసుల్లో బెయిల్ మంజూరు నేపధ్యంలో కోర్టు పలు సూచనలు చేసింది. సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ఠ కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని వెల్లడించింది. చంద్రబాబుకు కూడా కొన్ని కండీషన్లు విధించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమం లోనే ఈరోజు మధ్యాహ్నం 1.30కి హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు రానున్నారు. ఆ తర్వాత 3 గంటలకు గుంటూరు సీఐడీ రీజినల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 కి కుంచనపల్లి లోని సీఐడీ కార్యాలయానికి వెళ్ళి పూచీకత్తు, షూరిటీలను.. చంద్రబాబు సమర్పించనున్నారు. ఇక చివరగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ తాడిగడపలో ఉన్న రీజినల్ సీఐడీ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ కూడా అధికారులకు సంబంధిత డాక్యుమెంట్స్ ని అందించనున్నారు.
కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో.. సీఐడీ చంద్రబాబును ఏ1గా పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసుతో పాటుగా మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసు అయిన ఇసుక పాలసీ వ్యవహారంలో సైతం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది.
.
.