CM Revanth: సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రేపటి నుంచి మణిపూర్లో ప్రారంభం కానున్న భారత్ న్యాయయాత్రలో పాల్గొని, అదే రోజున దావోస్ వెళ్లనున్నారు. దీంతో భర్తీ కావాల్సిన కౌన్సిల్ సభ్యుల ఎంపిక విషయంలో అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో నిన్న మధ్యాహ్నం సీఎం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించే అవకాశం ఉంది.
అదేవిధంగా భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. మరొకవైపు ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైనందున ఈ నెల 18వ తేదీలోపు నామినేషన్ వేయాల్సి ఉండడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం చేకూరుతుంది, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్రెడ్డి వివరించనున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులకు నాయకుల ఎంపిక చేయడం కీలకం కావడంతో వీటిపై కసరత్తు చేశారు. ఈ నాలుగింటిలో ఒకటి ఓసీ, ఒకటి బీసీ, ఒకటి మైనారిటీ, ఒకటి ఎస్సీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న ఓసీలల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదంరాం, ప్రోటోకాల్ ఛైర్మన్ వేణుగోపాల్ రావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి, బీసీల్లో పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఈరావత్రి అనిల్ కుమార్, మైనారిటీల్లో మస్కతి డైరీ సంస్థ అధినేత మస్కతి, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్, మైనారిటీ సెల్ జాతీయ కార్యదర్శి ఫయూమ్ ఖురేషి, మహబూబ్నగర్ మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబుదుల్లా కొత్వాల్, కుసురపు పాసాలు, ఎస్సీకు ఇవ్వాల్సి వస్తే అద్దంకి దయాకర్ ఆశిస్తున్నారు.
వీరిలోనే ఎంపిక చేస్తారా? లేక కొత్తవారు తెరపైకి వస్తారా? అనేది వేచి చూడాలి. రేపు మణిపూర్లో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అదే రోజు ఢిల్లీ చేరుకుని మంత్రి శ్రీధర్బాబు, అధికారుల బృందంతో కలిసి దావోస్ వెళ్తారు. 15, 16, 17, 18 తేదీలల్లో అక్కడ జరిగే కార్యక్రమాలల్లో పాల్గొని పెట్టుబడులను ఆకర్శించేందుకు చొరవ చూపుతారు. ఆ తర్వాత లండన్ వెళ్తారు. అక్కడ ఒకరోజుండి ఈ నెల 20వ తేదీన తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.