Deputy CM Narayanaswamy : రాష్టంలో పులివెందుల తర్వాత వైకాపా సులభంగా గెలవగలిగే సీటు ఎదంటే చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరనే చెబుతారు. అయితే అక్కడ అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? ఆర్థిక వనరులు సమకూర్చే రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించిందా..? మరి ఇప్పుడు తండ్రిని తప్పించి కూతురికి సీటు ఇచ్చినంత మాత్రాన సహకరిస్తారా..? సీనియర్ మాత్రమే కాదు.. నమ్మకస్తుడనే కారణంతో మరో అవకాశం కల్పించారు. మరి ఫలితం ఉంటుందా..? గంగాధర నెల్లూరులో అసలేం జరుగుతుంది..?
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అంటే వైకాపాకు ఎదురులేని నియోజకవర్గం. ఎస్సీ మాల సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజికవర్గాన్ని అక్కడ లక్ష వరకూ ఓట్లు ఉంటాయి. వైకాపాకు సానుకూలంగా ఉండే ఈ ఓటు బ్యాంక్తో సులభంగా అక్కడ పార్టీ గెలవగలుగుతుంది. ఇలాంటి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అయితే.. మొదటి సారి గెలిచినప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో సమస్యలేమీ తలెత్తలేదు. కానీ తర్వాత అధికారంలోకి రావడం.. నారాయణ స్యామి డిప్యూటీ సీఎం కావడంతో పరిణామాలు మారాయి. మెజార్టీ మండల స్థాయి నాయకులు ఆయనను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ ఎంపి, ఎన్ఆర్ఐ సలహాదారు అయిన జ్ణానేంద్రరెడ్డి వర్గం నారాయణ స్వామిని తీవ్రంగా వ్యతిరేకించింది. మరో వైపు ప్రతి మండలంలోనూ ‘డూ ఆర్ డై’లాగా పార్టీకోసం పనిచేసిన క్యాడర్ కూడా నారాయణస్వామిని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైపు ప్రతికూల పవనాలు జోరుగా ఉన్నాయి.
మరో వైపు, గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణ స్వామి కూడా నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాలతో పరస్పరం రెండు వర్గాల మధ్య గొడవలు, విమర్శలు, వాదనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో నారాయణ స్వామికి గానీ.. ఆయన కుటుంబానికి గానీ.. టికెట్ ఇస్తే సహాకరించమని బహిరంగంగా ఓ వర్గం సమావేశాలు పెట్టింది. దీంతో పాటు, పెద్దిరెడ్డి నుంచి సీఎం జగన్ వరకూ ఫిర్యాదుల చిట్టాను పంపించారు. ఇలాంటి వాతావరణంలో డిప్యూటి సీఎం నారాయణ స్వామి ముందు నుంచి చంద్రబాబును, ఆయన సామాజికవర్గాన్ని తిట్టడమే శ్రీరామరక్షగా భావించి హడావిడి చేసారు. ఈసారి టికెట్ తనకు ఇవ్వక పోయినా ఫర్వాలేదు.. తన కూమార్తె కృపాలక్ష్మికి అయినా ఇవ్వమని అధిష్టానాన్ని కోరారు. చివరకు పార్టీ బలంగానే ఉందని భావించిన పార్టీ అధిష్టానం నారాయణ స్వామి కూతురుకే టికెట్ ఖరారు చేసింది.
మరోవైపు, రెడ్డి సామాజిక వర్గం తర్వాత కమ్మ, యాదవ సామాజిక వర్గం కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో టిడిపి ఈసారి గెలుపు ఖాయమంటూ కాలర్ ఎగరేస్తుంది. అందులోనూ ఆర్థికంగా బలమైన వ్యక్తిని రంగంలో దింపాం కాబట్టి ఇక మనకు తిరుగులేదనే భావనలో ఉంది. అయితే తమ స్వంత బలం మీదా కాకుండా నారాయణ స్వామికి ఉన్న వ్యతిరేకతను ఎలా క్యాష్ చేసుకోవాలి అనే అంశంపై ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇక్కడ టీడీపీ ఎంత వరకు విజయం సాధిస్తారనే విషయంపై స్పష్టత లేదు.
ప్రస్తుతం, నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ మొత్తం విజయానందరెడ్డి చూసుకుంటున్నట్లు సమాచారం. ఆయన స్వంత నియోజక వర్గం జీడి నెల్లూరు కావడంతో తన పట్టుకోసం ఖచ్చితంగా పనిచేస్తాడని అధిష్టానం ఆయన మీద నమ్మకంతో కృపాలక్ష్మికి అవకాశం ఇచ్చారని అంటున్నారు. మరో వైపు, ఇప్పటికీ వ్యతిరేక వర్గం నారాయణ స్వామిపై అనుమానస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. నారాయణస్వామి అయినా.. ఆయన కూమార్తె కృపాలక్ష్మి అయినా.. ఒకటే అనీ.. పార్టీలో అందర్నీ కలుపుకుపోరని మండిపడుతున్నారు. మొత్తం మీదా బలమైన నియోజకవర్గంలో ఈవిధంగా పార్టీ బలహీనంగా మారడానికి కారణం ఏంటనే అంశంపై స్థానికంగా తీవ్ర చర్చ నెలకొంది. వ్యాపారాలు మానుకోని నష్టపోయిన తమకు నారాయణస్వామి చేయూత ఇవ్వలేదని స్థానిక నేతలు వాదిస్తుంటే.. తాను వైఎస్ఆర్ కుటుంబ భక్తుడననీ.. అదే తనకు గెలుపు అందిస్తుందని నారాయణస్వామి ధీమాగా ఉన్నారు. మొత్తం మీద జీడీ నెల్లూరులో ఏం జరగుతుందో అని పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ఓటర్లు కూడా వేచి చూస్తున్నారు. ఇక.. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి లిస్టులో ఇద్దరు వారసులు రంగంలో దిగగా తాజాగా నారాయణస్వామి కూమార్తెతో ఆ సంఖ్య మూడుకు చేరింది. ఫైనల్ లిస్టు వచ్చే సరికి మరొకరు ఎంటర్ అవుతారని అంటున్నారు.