Ashwini Vaishnaw : ప్రతి ప్రయాణికుడికీ రైల్వే శాఖ 55 శాతం రాయితీని అందిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ సహా వివిధ అంశాలపై అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అశ్వినీ వైష్ణవ్ రాయితీలపై క్లారిటీ ఇచ్చారు. గతంలో జర్నలిస్టులకు, వృద్ధులకు ఇచ్చిన రాయితీలను పునరుద్ధరిస్తారా అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇప్పటికే ప్రతి ప్రయాణికుడూ రాయితీని అనుభవిస్తున్నారని.. ప్రత్యేకంగా రాయితీ అవసరం లేదని పరోక్షంగా ఆయన సమాధానమిచ్చారు.
ప్రతి ప్రయాణికుడికి రైల్వే శాఖ 55 శాతం రాయితీ అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణానికి రూ.100 ఖర్చవుతుంటే.. కేవలం రూ.45 మాత్రమే ఛార్జి రూపంలో రైల్వే శాఖ వసూలు చేస్తోందని తెలిపారు. అంటే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ ఇచ్చినట్లే కదా అని ఆయన అన్నారు.
కొవిడ్కు ముందు వృద్ధులకు, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్ ధరలో 50 శాతం రాయితీని ఇచ్చింది రైల్వే శాఖ. లాక్డౌన్ సమయంలో రైళ్లను నిలిపివేయడంతో పాటు.. రాయితీలనూ రద్దు చేసింది రైల్వే శాఖ. ఆ తర్వాత 2022లో రైళ్లను పునురుద్ధరించినప్పటికీ.. రాయితీల జోలికెళ్లలేదు రైల్వే శాఖ.
వీటిని పునరుద్ధరించాలని అనేక డిమాండ్లు వచ్చాయి. రైల్వే శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ అంశంపై లోక్సభ, రాజ్యసభల్లో పలువురు ఎంపీలు ప్రశ్నలు అడిగినప్పుడూ రైల్వే శాఖ మంత్రి ఇదే తరహాలో సమాధానం ఇచ్చారు. వృద్ధులకు రాయితీని రద్దు చేయడం ద్వారా 2022-23లో రైల్వే రూ. 2,242 కోట్లు ఆర్జించినట్లు ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడయ్యింది.