Dorababu Pendem : ఇన్ఛార్జిల మార్పుతో వైసీపీలో పొలిటికల్ కాక రేగుతోంది. ఆ పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే జన్మదిన వేడుక బలప్రదర్శనకు వేదికైంది.
పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టుందని.. దాదాపు 50వేల మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. పిఠాపురం టికెట్ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. సీఎం జగన్ ఆలోచించి తనకే సీటు ఇస్తారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే దొరబాబు జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను.. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జిగా అధిష్ఠానం నియమించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.