Atal Setu : ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఎంటీహెచ్ఎల్కు ‘అటల్ సేతు’గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.
రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతును నిర్మించారు. ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ఇప్పటివరకు రెండు గంటల సమయం పడుతోంది. అటల్ సేతు ద్వారా ఆ దూరాన్ని 15- 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు . అందులో 16 కిలోమీటర్లలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకొనేలా ఈ వంతెన నిర్మాణం సాగింది. అటల్ సేతు నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ప్రయోగించారు.
మోదీ నాసిక్లో మెగా రోడ్షోను నిర్వహించారు. 2 కిలోమీటర్లకుపైగా ఈ రోడ్ షో కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్ వద్ద మోదీ పూజలు చేశారు. రోడ్షోలో మోదీతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు.