Akash-NG missile : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్రమోగించిన ఆకాశ్ ఎన్జీ క్షిపణి (Akash-NG missile ) పరీక్ష విజయవంతమయ్యింది. ఒడిశాలోని చాందీపుర్లో సమీకృత పరీక్ష వేదిక(Integrated Test Range) నుంచి శుక్రవారం ఉదయం 10:30 నిమిషాలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. ఆకాశ్ ఎన్జీ క్షిపణి మానవ రహిత విమానాన్ని గాల్లోనే ధ్వంసం చేసింది. విజయవంతంగా ప్రయోగించిన ఈ క్షిపణి రేంజి 80 కిలోమీటర్లని DRDO తెలిపింది.
చాలా తక్కువ ఎత్తులో ఉన్న హై-స్పీడ్ మానవ రహిత విమానం(Unmanned Aerial Vehicle)పై ఆకాశ్ ఎన్జీ క్షిపణిని ప్రయోగించారు. లక్ష్యాన్ని గుర్తించిన క్షిపణి.. విజయవంతంగా మానవ రహిత విమానాన్ని ధ్వంసం చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్ & కమ్యూనికేషన్ సిస్టమ్తో కూడిన పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును పరీక్షించినట్లు DRDO ఒక ప్రకటనలో తెలిపింది.
ఆకాశ్ ఎన్జీ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టేందుకు కృషి చేసిన డీఆర్డీఓకు, భారత వైమానిక దళానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.