Gidugu Rudra Raju : వైఎస్ షర్మిల రాకను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. పొత్తులపై సీపీఐ, సీపీఎంలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కలిసొచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్తామని అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీఐ, సీపీఎంతో వారం రోజుల్లోనే భేటీ అవుతామన్నారు. పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. షర్మిల అవసరం ఎక్కడుందో అధిష్ఠానం అక్కడ ఆమెకు బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు.
“కాంగ్రెస్ పార్టీ సమాజంలో అందరికీ న్యాయం చేస్తుంది. సంక్రాంతి తర్వాత పార్టీలో పెనుమార్పులు రాబోతున్నాయి. సిటింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. ఈ నెల 17న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తారు” అని గిడుగు రుద్రరాజు తెలిపారు.