Professor Kodandaram : కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమై పని చేస్తున్నారని.. ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పాలననుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంక్షలు ఉండేవని.. ప్రజలు భయంతో బ్రతికారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరసన చేస్తే.. అక్రమ కేసులు పెట్టి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
నియంతృత్వ పోకడలే అధికారం కోల్పోవడానికి కారణమని.. కానీ బీఆర్ఎస్ నేతలు ఇంకా అది గుర్తించలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇక ఢిల్లీలో కూడా అధికార మార్పు రావాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ తప్పుబట్టారని కోదండరామ్ తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద ఇంకా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు కోదండరామ్.
తెలంగాణపై కేంద్రం చూపిస్తోన్న వివక్షను తెలియజేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.