Ayodhya Mandir Opening : జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందుగా.. ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది.
వారు జనవరి 17, 21, 22, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాలను సూచించారు. అయితే.. వీటిలో కాశీకి చెందిన పండితుడు.. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.
బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు.
ఇక… ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శిల్పశాస్త్రంలో జగత్ ప్రసిద్ధి గాంచిన అహ్మదాబాద్ నివాసి, ‘సోంపుర’ కుటుంబీకుడైన చంద్రకాంత్ సోంపుర అయోధ్య రామ మందిరం నిర్మాణానికి అంకురార్పణ చేశారు. చంద్రకాంత్కు సహాయంగా ఆయన సోదరులు..నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపురలు ఉన్నారు. చంద్రకాంత్ సోంపుర తాతగారైన ప్రభా శంకర్ సోంపు ర గారు సోమనాథ్ మందిరాన్ని రూపుదిద్దారు. శిల్పశాస్త్రంలో 15 తరాలుగా అనుభవమున్న వీరి కుటుంబమే లండన్ లోని స్వామి నారాయణ ఆలయంతో పాటు అమెరికాలోని చాలా దేవాలయాలను డిజైన్ చేశారు.