Ayodhya : అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమం కోసం ‘రామనంది’ అనే సంప్రదాయం ప్రకారం జరగనుంది. ఈ సంప్రదాయం మేరకే ఆలయంలో పూజలు కొనసాగనున్నాయి. ఆ ‘రామనంది’ శాఖ విశేషాలు మీకోసం..
రామనంది శాఖను జగద్గురు రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ పురాతన బైరాగి సాధు సంప్రదాయంలో ఒక భాగం. దీనికి బైరాగి శాఖతో బాటు రామవత్ శాఖ, శ్రీ శాఖ అనే పేర్లు కూడా ఉన్నాయి. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. వీరి మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’. వీరు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు.
రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. పసిపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో రాముడిని పూజిస్తారు. ఈ పూజా విధానంలో బాలరాముడిని రోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి చేస్తారు.
ఈ రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు.