Rohit Sharma : ఆఫ్గాన్ తో జరిగిన తొలి టీ 20లో విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. మొహలీలో వాతావరణం చాలా కఠినంగా ఉందని అన్నాడు. అయినా సరే కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు. ఫీల్డింగ్ చేసినప్పుడు బాల్ తగలగానే విపరీతమైన నొప్పితో బాధపడినట్టు తెలిపాడు. అందుకే ఫిజియో హాట్ వాటర్ బ్యాగ్స్ తీసుకువచ్చాడని అన్నాడు. అలాంటి వాతావరణంలో మా బౌలర్లు బ్రహ్మండంగా రాణించారని అన్నాడు.
ఈ మ్యాచ్ లో రనౌట్ పై రోహిత్ శర్మ మాట్లాడాడు. మ్యాచ్ ల్లో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయని తెలిపాడు. అయితే ప్రతీ ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలని, తన వంతు బాగా ఆడాలని కోరుకుంటాడు. నేను కూడా అలాగే ఫీలయ్యాను. సాధ్యమైనంత వరకు, 5 ఓవర్ల పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చేయాలని అనుకున్నాను.
కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాను. దీంతో నిరుత్సాహానికి గురయ్యానని తెలిపాడు. అయితే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఇది గేమ్. ఇందులో చాలా విచిత్రాలు జరుగుతుంటాయని తెలిపాడు. అయితే నేను అవుట్ అయినప్పటికి గిల్ మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడని భావించా. కానీ తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడని తెలిపాడు.
తర్వాత జితేష్, శివమ్ దూబే ఇద్దరూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారని అన్నాడు. శివమ్ ఇలాగే చివరి వరకు నిలబడితే, టీమ్ ఇండియాలో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నాడు. తర్వాత తిలక్, రింకూ సింగ్ కూడా తమ వంతు పాత్ర పోషించారని తెలిపాడు.
అంతకుముందు ఆఫ్గన్ కెప్టెన్ జద్రాన్ మాట్లాడుతూ మరో 30 పరుగులు చేసి ఉంటే, పరిస్థితి మా కంట్రోల్ లో ఉండేదని అన్నాడు. తేలిక లక్ష్యం కావడంతో వాళ్లు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఎటాకింగ్ గేమ్ ఆడి, భారత్ విజయం సాధించారని అన్నాడు.