Godavarikhani : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కూల్ డ్రింక్స్ లోడుతో కాగజ్ నగర్ వైపు వెళ్తున్న వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు హోటల్స్ ధ్వంసమయ్యాయి. రామగుండం కార్పొరేషన్ కు చెందిన చెత్త సేకరణ వాహనం, అక్కడే ఉన్న బైక్ నుజ్జు నుజ్జు అయ్యాయి.
ఈ ఘటనలో చెత్త సేకరణ వాహనంలో ఉన్న డ్రైవర్ చినుముల రమేష్ కు గాయాలయ్యాయి. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే వచ్చి క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన వాహనాన్ని లిఫ్ట్ ద్వారా పక్కకు తొలగించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం నిత్యం జనాలతో రద్దీ ఉంటుంది. తెల్లవారుజామున ఘటన జరిగింది. అందువల్లే ఆ సమయంలో జన సంచారం లేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఇంత పెద్ద కార్పొరేషన్లో రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు సరిగా లేకపోవడం ఈ ప్రమాదానికి ఒక కారణమని వారు చెబుతున్నారు.
కొంతకాలం నుంచి ఈ ఏరియాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని వెంటనే సర్వీస్ రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.