Hyderabad : పిల్లల స్కూల్లో అన్యువల్ డే ఫంక్షన్ కు కుటుంబమంతా వెళ్లారు. ఈ సమయంలో ఆ ఇంట్లో ఓ దుండగులు చోరికి పాల్పడ్డారు. కుషాయిగూడలో నివాసం ఉంటున్న దినేష్ అనే వ్యాపారి ఈసీఐఎల్ లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. పిల్లల స్కూల్లో అన్యువల్ డే ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి వెళ్ళారు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు తెరిచి ఉంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా కబోర్డ్ లో ఉన్న నగలు ఎత్తుకు వెళ్ళినట్టు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు . సుమారు 30 తులాల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లారని తెలిపారు.
మరోవైపు నగరంలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అభిలాష్ అనే వ్యక్తి వద్ద 16 లక్షల విలువైన బంగారం, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా విక్రమపురం గ్రామానికి చెందిన అభిలాష్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు.
మహారాష్ట్ర నాగ్పూర్లో అభిలాష్ మెకానికల్ ఇంజనీర్ చదివి మధ్యలోనే మానేశాడు. ఆ తర్వాత ఈజీ మనీ సంపాదనకు అలవాటుపడ్డాడు. తాళం వేసిన ఇళ్లు, సెక్యూరిటీ తక్కువగా ఉన్న అపార్ట్మెంట్లే టార్గెట్గా పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. అపార్ట్మెంట్లో ఎవరికైనా అనుమానం వస్తే డెలివరీబాయ్ అని చెప్పుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అభిలాష్ దాదాపు ఏడాదిన్నరగా దొంగతనలు చేస్తున్నాడు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో బోరబండ పోలీసులు ప్రచార వాహనం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని చెబుతున్నారు. సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిదంటున్నారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం గల తాళం అమర్చుకోవాలని సూచిస్తున్నారు. ఊరు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు, 100 డైల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రచారంలో తెలుపుతున్నారు.