Nagarkurnool : సంక్రాంతి పండుగ వేళ కొత్త బట్టలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భార్య.. భర్తను పండగకు కొత్త బట్టలు కొనివ్వాలని కోరింది. జీతం డబ్బులు రాలేదని.. అయినా కొనిస్తానని భర్త చెప్పగా ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య మనస్థాపానికి గురై తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పెంటలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ పెంటలో నివసించే చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వారికి 8 మంది సంతానం. చిన్న నాగమ్మ కొత్తబట్టల కోసం భర్తతో గొడవ పెట్టుకుంది. భర్త ఇంటి నుండి వెళ్లి వచ్చే సరికి చిన్న నాగమ్మ తనకున్న నలుగురి పిల్లల్లో యాదమ్మ (1), బయమ్మ (3) ఇద్దరి ఆడపిల్లలను గొంతు నులిమి చంపేసింది. ఆపై తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బయన్న.. కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచ్ మ్యన్గా పనిచేస్తున్నాడు. నాలుగైదు నెలలుగా జీతం రావడం లేదు. ఇటీవల తాను ఫైర్ లైన్ కూలీ పని చేసిన డబ్బులు చేతికి రావడంతో.. కొత్త బట్టల కోసం మన్ననూర్ గ్రామానికి వెళ్ళాడు. అంతలోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు, గూడెం వాసులు వాపోయారు. ముక్కుపచ్చలారని పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.