Pacer Praveen Kumar : టీమ్ ఇండియాలో ఒకప్పుడు అంతర్గతంగా జరిగినవి, వివాదాస్పదమైన ఘటనలను మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఏకరువు పెడుతున్నాడు. తాజాగా లలిత్ మోదీపై సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఏకంగా భారత్ క్రికెట్ అభిమానులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రోహిత్ శర్మకు కోపం వస్తే ఏమవుతుందో కూడా తెలిపాడు.
2012లో మెల్ బోర్న్ లో జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు. నిజానికి అప్పట్లో భారతీయులే ఇండియన్ క్రికెట్ ని, క్రికెటర్లను ఎక్కువగా విమర్శించేవారు. క్రికెట్ పై విశ్లేషణలు చేయడం అదొక ఫ్యాషన్ గా ఉండేది, ఎవడికి వాడు గొప్ప క్రికెటర్లులా మాట్లాడేవారు. మ్యాచ్ జరిగిన తీరుపై ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడేవారు. క్రికెటర్లు సరిగా ఆడకపోతే దారుణంగా విమర్శించడం, ఓడిపోతే దారుణంగా తిట్టడం సర్వసాధారణంగా జరిగేది.
మనవాళ్లే మన క్రికెట్ ని, మన క్రికెటర్లను తిడుతుంటే చాలా బాధనిపించేది. కానీ వాళ్లు చూస్తేనే క్రికెట్ కి ఆదరణ, వారినేమీ అనలేక గుక్కిళ్లు మింగుతూ ఉండేవాళ్లం. ఒకసారి మెల్ బోర్న్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను, రోహిత్, మనోజ్ తివారీ ఉన్నాం. గ్రౌండ్ కి వచ్చిన కొందరు భారతీయులు, రోహిత్ ని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. తను చాలా సేపు సహించాడు. ఇంక ఓర్చుకోలేక వారి వద్దకు వెళ్లాడు. నాక్కూడా కోపం వచ్చింది.
రోహిత్ కి సహాయంగా వెళ్లాను. ఆ సమయంలో వాళ్లు మమ్మల్ని దుర్భాషలాడారు. ఎవరో పక్కదేశం వాళ్లు విమర్శిస్తే పర్వాలేదు. కానీ స్వదేశం వాళ్లే రోహిత్ పట్ల అలా ప్రవర్తించడం తట్టుకోలేక, నేను సీరియస్ గానే రియాక్ట్ అయ్యాను. నా జీవితంలో అదే మొదటిసారి గొడవ పడటం, మళ్లీ ఎక్కడా నేను అలా ప్రవర్తించలేదని అన్నాడు.
ఇంక విరాట్ కొహ్లీ గురించి మాట్లాడుతూ తమ్ముడు లాంటివాడని అన్నాడు. నాతో ఎప్పుడూ క్లోజ్ గా ఉండేవాడు. అలాగే గంభీర్ కూడా మంచి స్నేహితుడు. నాకు అన్నలాంటి వాడు. ఇద్దరితో నేను బాగానే ఉండేవాడినని అన్నాడు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ అదంత పెద్దది కాదని అన్నాడు. ఇప్పుడు వారు బాగానే ఉన్నారు కదా.. అని అన్నాడు.
అలాంటి చిన్నచిన్నవి జట్టులో సభ్యుల మధ్య చాలా జరుగుతుంటాయని, ఎవరూ సీరియస్ గా తీసుకోరని అన్నాడు. ఆ క్షణం ఏదో అనుకుని మళ్లీ మామూలుగా కలిసిపోతారని తెలిపాడు. ఎందుకంటే మరుసటి రోజు వీరిద్దరూ వికెట్ల మధ్య పరుగెత్తాలి కదా.. అప్పుడు కో ఆర్డినేషన్ లేకపోతే చాలా కష్టమని అన్నాడు. అందుకే వీటికి పెద్ద ప్రాధాన్యత ఉండదని తెలిపాడు.