Prajavani: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతిభవన్ కంచెను తొలగించి ప్రజాభవన్గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతిభవన్లో నేడు సామాన్యులు అడుగుపెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడ ప్రజావాణికి జనం పోటెత్తారు.