Kaleshwaram Scam: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు మూడురోజులు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసుల్లో విస్తృత తనిఖీలు చేశారు. మంగళ, బుధ, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు చేసి, పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం, తిమ్మాపూర్ ఇరిగేషన్ కార్యాలయంలోని హార్డ్ డిస్క్లను కూడా అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ పుట్టపగిలిపోనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టారు. ఈ విషయంలో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ప్రాజెక్ట్ అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై అధికారులు ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు అధికారులు. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత స్కామ్ పై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాజెక్టు నాణ్యతపై కూడా దృష్టి పెట్టారు. 46 అంశాలపై సమాచారాన్ని అధికారులు సేకరించారు. బ్యారేజీకి వినియోగించిన సామాగ్రిలో నాణ్యత లోపంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ప్రశ్నగా మారింది. దీనిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలతో పాటు కన్నెపల్లి గాయత్రి పంప్ హౌస్లలో కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. 12 హార్డ్ డిస్కల కు గాను ఆరు హార్డ్ డిస్కలు మాత్రమే సోదాల్లో లభించాయి. విజిలెన్స్ సోదాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో భయం మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్ల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ రమేష్ చారి అన్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లు, హార్డ్ డిస్క్లు హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు తరలించామన్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో మూడో రోజు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిపారు.