Swamy Vivekananda : భారతీయ సనాతన మూలాలను, పాశ్చాత్య దేశాల భౌతిక పురోగతిని కలిపి నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలని తపించిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవకారుడు.. స్వామీ వివేకానంద. తన పదునైన ప్రసంగాలతో జాతి ఆత్మను తట్టిలేపిన వివేకానంద.. నిరాశలో మునిగితేలుతున్న భారతావనిని జాగృతపరచారు. ‘లేవండి.. మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి… బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలి’ అనే ఆయన మాటలు యువతను నేటికీ చైతన్య పరుస్తూనే ఉన్నాయి.
స్వామీ వివేకానంద… అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. కోల్కతాలో జనవరి 12న కోల్కతాలో విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే ఆటలలోనూ, చదువులోనూ చురుగ్గా ఉండేవారు. దేన్నైనా ఒక్కసారి వింటే అర్థం చేసుకుని, ఎప్పటికీ గుర్తుపెట్టుకునేవాడు. 1880లో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. తర్వాత తత్వశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం సత్యాన్వేషణలో భాగంగా ఆధ్యాత్మిక గురువును ఎంచుకునే పనిలో పడ్డారు. చాలామంది పండితులను కలిసినా ఆయనకు నిరాశే ఎదురైంది.
అదే సమయంలో నరేంద్రుడు ఒకరోజు అనుకోకుండా కొందరు స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళి, ఆయన ప్రసంగాలను ఆలకించారు. ఆ సమయంలో రామకృష్ణుల చూపు నరేంద్రుడిపై పడింది. నరేంద్రుడిని చూసిన రామకృష్ణులు అనంతమైన ఆనందానికి, భావోద్వేగానికి గురయ్యారు. నరేంద్రునికీ అదే భావన కలగటంతో తరచూ రామకృష్ణుల దర్శనానికి వెళ్లటం, కాలక్రమంలో ఆయన శిష్యుడిగా మారిపోయారు. ఆయన చేతుల మీదగానే సన్యాస దీక్ష తీసుకున్న నరేంద్రుడు.. స్వామీ వివేకానంద అయ్యారు.
దేశాన్ని మార్చగలిగిన శక్తి యువతకే ఉందని, వారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని వివేకానందులు పిలుపునిచ్చారు. ‘విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకోండి. మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు. మీ ప్రయత్నం చిన్నదే అయినా.. ధైర్యంగా దానిని కొనసాగిస్తే.. దాని ఫలితం గొప్పగా ఉంటుంది.’ అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపారు.
1893లో చికాగోలో జరిగిన సర్వ ధర్మ మహాసభకు సనాతన ధర్మపు ప్రతినిధిగా హాజరై అప్పటి వరకు భారతదేశంపై పాశ్చాత్యులకున్న అనుమానాలను పటాపంచలు చేశారు. అనంతర కాలంలో పలు ప్రాంతాల్లో పర్యటించి భారతీయ యోగ, వేదాంత శాస్త్రాలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసి వారిని అబ్బురపరిచారు.
తన గురువైన రామకృష్ణ పరమహంస పేరుతో రామకృష్ణ మిషన్ను 1897 మే 1న స్థాపించి, గురుదేవుల ప్రసంగాలను, రచనలను ఆయా భాషల వారికి అందేలా చేశారు. అంతేగాక.. గొప్ప సామాజిక సేవకు కేంద్రాలుగా రామకృష్ణ మఠాలను తీర్చి దిద్దే యోజనను అందించారు. మతానికి కొత్త అర్థాన్ని, సేవకు సరికొత్త పరమార్థాన్ని నిర్వచించిన వివేకానందుడు.. నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవయని చాటిచెప్పారు. ప్రపంచమానవులంతా అన్నదమ్ములనే సౌభ్రాతృత్వ భావనకు ప్రాణంపోసిన ఆ మహోన్నత మానవతావాది.. అతి చిన్న వయసులో నలభై ఏళ్లకే (1902 జూలై 4న) పరమాత్ముని చేరుకున్నారు. ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానందుని జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుతోంది.