Ayodhya Ram Mandir : అయోధ్యలో నూతన రామమందిరంలో రాముడి మూలమూర్తిని ప్రతిష్టితం చేయనున్నారు. దీనికోసం.. కాశీ పండితులు.. లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహించనుంది.
శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు 4 వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాదికాలు నిర్వహిస్తారు. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని మోదీ శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు.
జనవరి 17నుంచి 22వ తేదీ వరకు రోజూ ఉదయం 8 గంటలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పలు విధులు సాగనున్నాయి. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమగుండాలు రెడీ అయ్యాయి.
అహ్మదాబాద్లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం చేపట్టింది. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. ప్రస్తుతం అయోధ్యకు దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం వెయ్యి రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి.
సాధారణంగా రామలీల కార్యక్రమాన్ని ఏటా దసరా రోజున పదర్శిస్తారు. కానీ.. 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్లో రామలీలను ప్రదర్శించనున్నారు. దీనిలో పాకిస్థాన్, రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ కళాకారులు దీనిలో భాగస్వాములు కానున్నారు.
అయోధ్య ఆలయంలో పూజాదికాలు నిర్వహించేందుకు పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. దీనికి 3 వేల దరఖాస్తులు రాగా.. 20 మందిని మాత్రమే ఎంపిక చేశారు.
నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కాగానే.. ఇక్కడి రామ్ఘాట్లోని తులసిబారి వద్ద 28 మీటర్ల వ్యాసం కలిగిన అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. ఈ దీపం కుందిలో 21 క్వింటాళ్ల నూనె, ఇందులోని ఒత్తి తయారీకి 125 కిలోల పత్తి పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ దీపం పేరు దశరథ్ దీప్ కాగా.. దీని నిర్మాణంలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగించారు. తపస్వి కంటోన్మెంట్కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేశారు. 7.5 కోట్ల ఖర్చుతో, 108 మంది నిపుణులు దీని నిర్మాణం కోసం పనిచేశారు.
ప్రతిష్ట తర్వాత బాల రాముడిని సరయూ జలాలతో అభిషేకిస్తారు. ఈ జలాలను నింపేందుకు అవసరమైన లక్షకు పైగా రాగి, ఇత్తడి,కంచు పాత్రలను వారణాసిలోని చేతి వృత్తుల వారు అందించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామా కూడా కాశీ నుంచి అయోధ్యకు చేర్చారు.