Swachh Survekshan Awards 2023 : మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore) నగరం మరోసారి సత్తా చాటింది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీస్(Cleanest Cities) జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు (Swachh Survekshan Awards 2023)ల్లో ఇండోర్ వరుసగా ఏడోసారి తొలి స్థానంలో నిలిచింది. ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ (Surat) కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఇక నవీ ముంబయి ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం (4), విజయవాడ (6), తిరుపతి (8), హైదరాబాద్ (9) నగరాలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రెండు , ఛత్తీస్గఢ్ మూడో స్థానంలో నిలిచాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో మహారాష్ట్రలోని సస్వాద్ క్లీనెస్ట్ సిటీ అవార్డును కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని పటాన్, మహారాష్ట్రలోని లొనావాల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి పాల్గొన్నారు. 2016 నుండి స్వచ్ఛ్ భారత్ అర్బన్ మిషన్(Swachh Bharath Urban Mission) కింద కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్.. ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుధ్య, పరిశుభ్రత సర్వేగా నిలిచింది.