Vyuham Movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “వ్యూహం” సినిమా విడుదలను ఆపాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. సినిమా విడుదలకు సంబంధించిన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆర్జీవీ తీసిన ఈ సినిమా విడుదలను ఆపాలని పిటిషన్ దాఖలైంది. సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ను చూస్తే.. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా సినిమా తీశారని తెలుస్తోందని, తెలుగు రాష్ట్రాలతో పాటు.. యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోనూ సినిమాను విడుదల చేయకూడదని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో “వ్యూహం”విడుదలకు జారీ చేసిన సీబీఎఫ్ సీ సర్టిఫికేట్ ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని నిర్మాత తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అనుకుంటే.. తెలంగాణలోనైనా విడుదలకు అనుమతివ్వాలని కోరారు. దానిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, లోకేష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం దీనిపై ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. శుక్రవారానికి తీర్పును రిజర్వ్ చేసింది.