Anantapur : ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోవిందరాజు, దీప అనే దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత జన్మించింది. 9 నెలలు చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.
సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కూడా పాప గొంతులో ఇరుక్కున్న నిమ్మకాయను బయటకు తీయలేకపోయారు. దీంతో 108 వాహనంలో అనంతపురం నుంచి పామిడిలో ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ వద్ద చూపించారు. కానీ.. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలిపారు. అక్కడి నుంచి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా.. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పెళ్లైన ఏడేళ్లకు.. లేకలేక పుట్టిన పాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.