ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పుడు కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ చుట్టూ తిరుగుతోంది. ఆయన అధికారంలో ఉన్న వైసీపీకే సపోర్ట్ చేస్తారా..? లేక టీడీపీ – జనసేన నాయకుల రాయబారాలతో ఆ కూటమికి మద్దతు తెలుపుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
గోదావరి జిల్లాల రాజకీయం మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తీసుకుంటోంది. మొన్నటివరకు వైసీపీతో చర్చలు జరిపిన ముద్రగడ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కాపులంతా ఏకం కావాలన్న పవన్ స్టేట్మెంట్ ముద్రగడను ఆలోచనలోపడేసింది. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. ముద్రగడతో భేటీ అయ్యారు. పవన్ రాసిన లేఖకు ముద్రగడ బొలిశెట్టి ద్వారా రిప్లై పంపించినట్టు తెలుస్తోంది. కాపులంతా ఐక్యం కావాలని పవన్ రాసిన లేఖను ముద్రగడ స్వాగతించారు. ఒకట్రెండు రోజుల్లో ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ను కలవనున్నారు.
ఇదిలా ఉండగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముద్రగడ వద్ద రాయబారిని పంపారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లారు. నెహ్రూకు ముద్రగడ స్వాగతం పలికారు. టీడీపీ జనసేన కూటమిలోకి రావాలని ఆహ్వానించారు.
మరి ముద్రగడ టీడీపీలోకి వెళ్తారా..? జనసేనలోకి వెళ్తారా? లేక టీడీపీ జనసేన కూటమికి కాపు ఉద్యమ నేతగా మద్దతు తెలుపుతారా? అనేది తేలాల్సి ఉంది. ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
.
.