అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్న వేళ.. దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 326 పాయింట్లు పెరిగి.. 71,984 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 91 సాయింట్లు పుంజుకొని.. 21,710 వద్ద కొనసాగుతోంది. గురువారం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.03 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
కాగా.. అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం నష్టపోయాయి. అక్కడ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇక్కడ నష్టాలతో ప్రారంభమవుతాయని భావించిన వేళ.. అనూహ్యంగా లాభాల్లో కనిపించాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గురువారం ఉదయం 77.12 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.