Sandeep Lamichhan : అత్యాచారం కేసులో నేపాల్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన తొలి నేపాలీ ప్లేయర్ సందీప్ లామిచానేకు షాక్ తగిలింది. ఓ యువతిపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో ఖాట్మండ్ జిల్లా కోర్టు బుధవారం 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 3,00,000 నేపాలీ రూపాయలు జరిమానా విధించింది. అంతేకాదు మరో 2,00,000 నేపాలి రూపాయలు బాధితురాలికి చెల్లించాలని తీర్పు చెప్పింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2018లో సందీప్ లామిచానే అరంగేట్రం చేశాడు. అలా తొలి నేపాల్ క్రికెటర్గా నిలిచాడు. డిల్లీ క్యాపిటల్స్ తరఫున 2018,2019 సీజన్లలో ఆడాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన సందీప్ 9 మ్యాచులు ఆడి 13 వికెట్లు తీశాడు.
23 ఏళ్ల సందీప్ పై 2022 ఆగస్టులో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. ఆ సమయానికి తను మైనర్ అని బాధితురాలు పేర్కొంది. అలాగే కేసు విచారణలో జాప్యం జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తర్వాత స్వదేశానికి వచ్చిన సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవలోనే నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది.
విచారణ సమయంలో బెయిల్ మీద బయటికి వచ్చిన సందీప్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. నేపాల్ జట్టు తరఫున వన్డే ప్రపంచ కప్ 2023 క్వాలిఫయర్స్, 2023 ఆసియా కప్ లో ఆడాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కేసు విచారణలో ఇరువైపు వాదనలు విన్న కోర్టు సందీప్ ని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేయనున్నట్టు సందీప్ న్యాయవాదులు తెలిపారు.
నేపాల్ క్రికెట్ జట్టులో మంచి ట్రాక్ రికార్డ్ సందీప్ కి ఉంది. 52 టీ 20 మ్యాచ్ లు ఆడి 98 వికెట్లు, 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తీసుకున్నాడు. అలాగే నేపాల్ జట్టుకి కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. సందీప్ జీవితం నుంచి యువ క్రికెటర్లు నేర్చుకోవల్సింది ఎంతో ఉందని పలువురు సూచిస్తున్నారు.