విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేశినేని వైసీపీలో చేరుతున్న వేళ ఆయనను ఉద్దేశించి ఘాటుగా సైటర్లు వేశారు. “బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వాడి బుద్ది గురించి అందరికీ తెలిసిందే కదా” అని పీవీపీ ట్వీట్ చేయడం బెజవాడలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కేశినేని నాని కలిసిన తర్వాత రోజే పీవీపీ ఇలాంటి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండనున్నారు. 2019 ఎన్నికల్లో పీవీపీ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో నాని టీడీపీని వీడారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
అసలు కేశినేని నాని, పీవీపీ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2014లో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని పీవీపీ భావించారు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ద్వారా ఎంపీ టిక్కెట్ కోసం రాయబారాలు నడిపారు. నాటి పరిస్థితుల్లో కేశినేని నానికే టీడీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో మరోసారి ఆయనే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పీవీపీ పైనే నాని గెలిచారు. ఇప్పుడు వైసీపీలోకి కేశినేని నాని చేరేందుకు సిద్ధమవడంతో పీవీపీ ఇలా ట్వీట్ల ద్వారా ఎటాక్ చేస్తున్నారు. 5 రోజుల క్రితం కూడా కేశినేనిపై ఘాటు విమర్శలు చేస్తూ పీవీపీ ట్వీట్ చేశారు.
.
.