Kesineni Nani: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. కేశినేని వ్యవహారంతో మరింత వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న నాని.. మరికొన్ని గంటల్లో వైసీపీ గూటికి చేరనున్నారు. అయితే.. జంపింగ్ వేళ కేశినేని ఎంపీ సీటుతోపాటు 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచారు. దీనికి వైసీపీ నో చెప్పింది. ఒక ఎమ్మేల్యే, ఎంపీ సీటుతో సర్దుకోవాలని సూచించింది. దీంతో నానిని నమ్ముకున్న అనుచరులు అయోమయంలో పడ్డారు.
వైనాట్ 175 అంటున్న జగన్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. మార్పులు చేర్పుల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే అసంతృప్తుల జ్వాలలు ఎగిసిపడుతుండటంతో.. నాని డిమాండ్లను పక్కనపెట్టింది వైసీపీ అధిష్టానం. ఎంపీతోపాటు ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే నాని అనుచరుడు స్వామిదాస్కు అవకాశం కల్పిస్తూ తిరువూరు సీటును ఫైనల్ చేసింది. ఇక కేశినేని కూతురు శ్వేతకు.. అలాగే నాని ప్రధాన అనుచరుడు బొమ్మబోయిన సుబ్బారావుకు టికెట్ లేదని తేల్చి చెబుతోంది.
వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యాక కేశినేని తన డిమాండ్లను గట్టిగా నొక్కి చెప్పారు. అయితే.. జగన్తో భేటీ తర్వాత డిమాండ్ కాస్తా రిక్వెస్ట్గా మారింది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేనందునే వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి తలొగ్గాల్సి వస్తుందని.. తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్యలాగే కేశినేని పరిస్థితి కూడా మారిపోతుందని ఆయన అనుచరులు అంటున్నారు.
.
.