Alluri Sitarama Raju : తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ నిందితుడు. తన నేరం బయటపడుతుందని భావించి బాలికను చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డారు. చివరికి ఆ అమాయకురాలిని హత్య చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో చోటు చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక తల్లిదండ్రులు జనవరి 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేశ్(19) అనే యువకుడు ఓ బాలికను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలికను రమేష్ లాక్కుని వెళ్లడాన్ని కొందరు చిన్నారులు చూశారు. రమేశ్ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిన విషయం చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు.
మొదట రమేశ్ ఇంట్లోకి ప్రవేశించాడు కొంతసేపటి తర్వాత సీతన్న కూడా వెళ్లాడు . ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం తన గొంతు కుచీరతో ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించలని తనని దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తుండగా.. శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినప్పటికీ.. అంతక్రియలు పూర్తి చేశారు.
ఈనెల 5న గూడెం కొత్తవీధి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్కుమార్, ఎస్సై అప్పలసూరి గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేశారు. నిందితులిద్దరూ తమ పేర్లు బయటకు వస్తాయని భావించి వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.