SBI Bank Manager : డబ్బులను ఇంట్లో దాచుకుంటే రక్షణ ఉండదని.. బ్యాంకులో పెడితే నిశ్చింతగా గుండెల మీద చేయివేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చని అందరూ అనుకుంటారు. కానీ.. కొందరు బ్యాంకు సిబ్బంది చేస్తున్న నిర్వాకాల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఎంతో కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో దాచుకుంటే.. వాటిని గోల్ మాల్ చేస్తూ సామాన్యుల పొట్టకొడుతున్నారు. అయితే.. ఇన్ని రోజులు కింది స్థాయి సిబ్బంది ఇలాంటి పనులకు పాల్పడుతుండగా.. ఇక్కడ మాత్రం ఎస్బీఐ బ్యాంకు మేనేజరే స్వయంగా డబ్బులు స్వాహా చేశాడు. అది కూడా లక్షో, రెండు లక్షలో కాదు.. ఏకంగా 4 కోట్ల 75 లక్షల నిధులు మింగేశాడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్లో చోటు చేసుకుంది.
బ్యాంక్ మేనేజర్ చేతి వాటానికి పాల్పడ్డాడు. ఫిక్స్డ్ డిపాజిట్లపై కన్నింగ్ తెలివి తేటలు ప్రదర్శించాడు. ప్రీమియం ముగిసే వరకు ఎవరూ అడగరని తరచూ చోరీకి అలవాటుపడ్డాడు. అలా భారీగా డబ్బులు కొట్టేశాడు. ఓ యువతి ఫిర్యాదుతో మొత్తం బండారం బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సనత్నగర్ ఎస్బీఐలో నిధుల గోల్ మాల్ జరిగింది. ఖతాదారుల పిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ. 4.7 కోట్లు బ్యాంక్ మేనేజర్ స్వాహా చేశాడు. ఓ యువతి ఖాతా నుంచి ఎస్బీఐ మేనేజర్ కార్తిక్రాయ్ రూ.48 లక్షలు కొట్టేశాడు. ఈ యువతి ఆరు నెలలుగా అడుగుతుంటే ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఈ మేరకు ఎస్బీఐ మేనేజర్ కార్తిక్ రాయ్ను పోలీసులు విచారించారు. అయితే యువతి డబ్బుల విషయమే కాకుండా బ్యాంకులో జరిగిన రూ. 4.7 కోట్ల గోల్మాల్ విచారణ ద్వారా బయటపడింది. ‘ఈ డబ్బులు ఎందుకు తీశారు? ఏం చేశారు? గోల్మాల్లో ఇంకెవరైనా ప్రమేయం ఉందా?’ అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడు కార్తిక్పై డిపాజిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్తిక్రాయ్ నుంచి రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.