Allagadda TDP Politics | ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి అనట్లు తయారైంది టీడీపీ రాజకీయం. మాజీ మంత్రి ఏవీ మళ్లీ లైన్లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికలలో సీటు తనదంటే తనదని.. ఆయా నేతలు చేసుకుంటున్న ప్రచారంతో కేడర్ కన్ఫ్యూజన్లో పడిపోతోంది.
Allagadda TDP Politics | ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి అనట్లు తయారైంది టీడీపీ రాజకీయం. మాజీ మంత్రి ఏవీ మళ్లీ లైన్లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికలలో సీటు తనదంటే తనదని.. ఆయా నేతలు చేసుకుంటున్న ప్రచారంతో కేడర్ కన్ఫ్యూజన్లో పడిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి పక్కా బ్రాండ్ ఇమేజ్ ఉంది. అఖిలప్రియ తాత ఎస్వీ సుబ్బా రెడ్డి మంత్రిగా, తండ్రి భూమా నాగిరెడ్డి ఎంపీగా, తల్లి శోభ ఎమ్మెల్యేగా పనిచేసి దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు.
ఆలాంటి కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిలప్రియకు పోటీగా టిడిపి టికెట్ రేసులోకి వచ్చారు. దాంతో వర్గపోరు పెరుగుతూ టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది భూమా కుటుంబానికి… శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మరణాలతో ఆ కుటుంబంలో రాజకీయాలు మారుతూ వచ్చాయి .. శోభానాగిరెడ్డి 2014 ఎన్నికల సమయంలో మరణించారు .. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలో చేరారు. తల్లి మరణం తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలిచి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నంద్యాల అసెంబ్లీకి నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన సోదరుడి కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. 2019లో భూమా కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు పరాజయం పాలయ్యారు ఎన్నికలలో భూమ కుటుంభం పోటీ చేసి ఓడిపోయారు.
గతంలో ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి కంచుకోటగా ఉండేది.. అయితే అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ కేడర్లో చీలిక వచ్చింది. అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిలు సానుభూతితో గెలిచినా.. 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. దాంతో నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ రాజకీయాలు కూడా మారిపోయాయి. ప్రస్తుత ఆళ్లగడ్డ రాజకీయ సమీకరణాలను చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రైట్ హ్యాండ్గా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేశారు ఏవీ సుబ్బారెడ్డి. అలాంటి నాయకుడు కొంత కాలంతో అదే కుటుంబాన్ని విభేదిస్తూ.. నిత్యం వర్గ విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భూమా కుటుంబ వారసులతో ఆయన వర్గానికి విభేదాలు కామన్ అయిపోయాయి.
ఏవీ సుబ్బారెడ్డి తమ కుటుంబాన్ని మోసం చేశారంటూ అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు వర్గపోరుకు అనేకసార్లు ఏవి తీరుపై మండిపడ్డారు… తమ కుటుంబ ఆస్తులను ఏవీ తనపేరు మీదకు మార్చుకుని .. ఫ్యామిలీ మెంబర్లా ఉంటూనే వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది… అప్పటినుండి మొదలైన విభేదాలు అలాగే కొనసాగుతూ .. ప్రస్తుతం తీవ్రతరమయ్యాయి … అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ వర్గపోరు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా రోడ్డెక్కాయి.. నంద్యాలలోని కొత్తపల్లి వద్ద నారా లోకేష్కి స్వాగతం పలికేందుకు పోటీపడిన భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు చివరికి బాహాబాహీకి దిగారు.
ఈ క్రమంలో ఏవి సుబ్బారెడ్డని రక్తం వచ్చేలా భూమా వర్గీయులు కొట్టారు. దాంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అఖిల ప్రియతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందర్నీ అరెస్ట్ చేశారు. ఇందులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటూ వారు అలా విరోధులుగా మారడం టీడీపీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ లేదా నంద్యాల టికెట్ దక్కించుకోవడానికి పాపులు కదపడం మొదలుపెట్టారు. తనదైన స్టైల్లో టీడీపీ అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారట. అయితే ఆయనకు టికెట్పై ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వని టీడీపీ పెద్దలు.. భూమా కుటుంబ వారసుల వైపే మొగ్గుచూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
తమ నేతకే టికెట్ దక్కుతుందని ఏవి సుబ్బారెడ్డి వర్గం చేస్తున్న ప్రచారంతో ఆళ్లగడ్డ టీడీపీ వర్గాల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోందిప్పుడు. ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తారా? లేక ఏవీ సుబ్బారెడ్డి బరిలో ఉంటారా అనేది అర్థం కాకుండా తయారవ్వడంతో.. ఎవరి వెంట నడవాలో అర్థంగాక దిక్కులు చూడాల్సిన పరిస్థితిలో టిడిపి వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాలకు తోడు .. మరోవైపు జనసేన నాయకుడైన ఇరిగిల రాంపుల్లారెడ్డి వర్గం కూడా టికెట్ తమదే అని హడావుడి చేస్తుండటంతో.. ఆళ్లగడ్డ పరిస్థితి మూడుముక్కలాటలా తయారైంది.
నంద్యాల పార్లమెంట్ కేంద్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని స్కిల్ స్కాం కేసులో అరెస్టు చేశారు. దానిపై ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం శ్రేణులు తాజాగా ఆళ్లగడ్డలో జరిగిన ‘రా కదలి రా’ సభను విజయవంతం చేశారు. అయితే ఏవి సుబ్బారెడ్డి వర్గం ఈ సభకు హాజరు కాలేదు. ఏవీ సుబ్బారెడ్డి కు ఎలాంటి పిలుపు రాలేదంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. స్థానిక జనసేన నేత ఇరిగిల రాంపుల్లారెడ్డి కూడా ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభకు దూరంగా ఉన్నారు. ఆ సభా ఏర్పాట్లన్నీ అఖిలప్రియ సారథ్యంలో జరగడం వల్లే వారు దూరంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది .
మొత్తానికి ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభ సక్సెస్ అయినప్పటికీ .. అక్కడ నుంచి పోటీలో ఉండేదెవరు? అనే దానిపై మాత్రం తెలుగు తమ్ముళ్లకు క్లారిటీ లేకుండా పోయింది.. ఆ సభలో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డితో పాటు వైసీపీపై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు.. ఇసుక కమీషన్లు దోచుకుతింటున్నారని బ్రిజేంద్రపై ఫైర్ అయ్యారు.
అయితే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేదెవరన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆళ్లగడ్డ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని చూసిన తెలుగుతమ్ముళ్లకు నిరాశే మిగిలింది. మరోవైపు ఈ సారి సెగ్మెంట్లో గణనీయంగా ఉన్న బలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దించాలన్న డిమాండ్ వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తుందంట. చూడాలి మరి ఆళ్లగడ్డ టీడీపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో?