Houthi Attacks : ఒకటీ అరా కాదు.. ఏకంగా 50 వాణిజ్య నౌకలను హౌతీ రెబెల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. హద్దులు మీరవద్దంటూ వారం రోజుల క్రితం అమెరికా చేసిన హెచ్చరికలనూ పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి భీకర దాడులకు పాల్పడ్డారు. ఎర్రసముద్రంలో ఉన్న ఈ నౌకలపై యాంటీషిప్ మిస్సైళ్లు, సూసైడ్ డ్రోన్ యూఏవీలను ప్రయోగించారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
యెమెన్లోని రెండు ప్రాంతాల నుంచి ఈ దాడులు జరిగినట్టుగా భావిస్తున్నారు. మోఖా, హొడైడా నుంచి వరుసబెట్టి 21 మిస్సైళ్లు, డ్రోన్లతో హౌతీలు విరుచుకుపడ్డారు. ఎర్రసముద్రంలో హౌతీలు, యూఎస్ టాస్క్ ఫోర్స్ మధ్య భీకర పోరు సాగుతోంది. యూఎస్ నేవీ, రాయల్ నేవీ ఈ దాడులను తిప్పి కొడుతున్నట్టు తెలిసింది.
ఇప్పటివరకు సంయుక్త నావికాదళాలు 18 సూసైడ్ డ్రోన్లను ధ్వంసం చేశాయి. గత నాలుగు నెలలుగా హౌతీలు దాడులకు తెగబడుతుండగా.. ఇదే అతి పెద్ద దాడిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాద సంస్థ.. గత 7 వారాల్లో జరిపిన 26వ దాడి అని అమెరికా మిలటరీ తెలిపింది. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం ఏదీ సంభవించలేదు.