Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్టేషన్ లో రైలు ఆగుతున్న క్రమంలో పట్టాలు తప్పగా.. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఇంజిన్ బలంగా ఢీ కొట్టడంతో రైలు కుదుపులకు గురైంది. రైలులో మూడు బోగీలు పక్కకు ఒరగడంతో.. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
రైలు ప్రమాదంపై అధికారులు అలర్టయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.