తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం జగిత్యాల నేషనల్ హైవేపై ఇంధన ట్యాంకర్ బోల్తా పడగా.. మంటలు చెలరేగిన ఘటన తెలిసిందే. సుమారు 14 గంటల పాటు మంటలు ఎగసిపడుతూనే ఉండగా.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తాజాగా.. జగిత్యాలలోనే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కలపమిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలపమిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడిగురుజు వద్దనున్న మిల్లులో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లోనే మంటలు మిల్లంతా వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.