ఐపీఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్ మోదీ తనని బ్లాక్ మెయిల్ చేశారని 37 ఏళ్ల మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు తన మద్యం వ్యసనం వల్ల కోచ్ గా అవకాశాలు కూడా కోల్పోయానని అన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కే కాదు, అన్ని రకాల క్రికెట్ లకు దూరంగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో విషయాలు బయటపెట్టాడు.
ఐపీఎల్ ప్రారంభంలో నేను ఆర్సీబీ తరఫున ఆడాను. అయితే ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడటం ఇష్టం లేదు. నేను ఉండే మీరట్ నుంచి బెంగళూరు 2,300 కిలో మీటర్లు ఉంటుంది. అక్కడ స్థిరపడిపోయిన నేను చీటికి మాటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అదే ఢిల్లీ అయితే కేవలం 2 గంటల్లో వెళ్లవచ్చు. ఈ కారణంగా ఢిల్లీకి ఆడాలని అనుకున్నాను. కానీ లలిత్ మోదీ బెదిరించాడు.నువ్వు ఆర్సీబీకి ఆడకపోతే నీ కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. దాంతో విధి లేక ఆడాను. అసంతృప్తిగా ఆడటంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని తెలిపాడు.
మొదట్లో నాకు తెలయకుండా ఐపీఎల్ పేపర్ల మీద సంతకాలు పెట్టాను. అందులో ఆర్సీబీకి ఆడుతున్నట్టుగా రాశారు. నాకు అప్పట్లో ఇంగ్లీషు పెద్దగా రాదు. వాళ్లని నమ్మి సంతకం పెట్టాను. తర్వాత మారుదామని అనుకున్నా అవకాశాలు రాలేదు.ఇదొక్కటే కాదు బెంగళూరు జట్టు తరఫున ఆడేందుకు ఇష్టం లేకపోవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా అక్కడి భోజనం ఇష్టం ఉండదు. ఫాస్ట్ బౌలర్లకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అదే ఏ మాత్రం తేడా కొట్టినా, అరగకపోయినా బౌలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు తప్పవు. ఈ భయంతోనే ఢిల్లీకి వెళ్లాలని భావించాను. కానీ లలిత్ మోదీ తన భవిష్యత్ తో ఆడుకున్నాడని ప్రవీణ్ కుమార్ ఆరోపించాడు.
అయితే అతిగా మద్యం సేవించడం వల్ల కోచ్ గా అవకాశాలు కోల్పోయానని అన్నాడు. అంతేకాదు బాల్ టాంపరింగ్ పై మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్లే అధికంగా ఈ పని చేస్తారని అన్నాడు. బాల్ ను పట్టుకుని ఫీల్డర్స్ అందరూ కలిసి తెగ రుద్దుతారని తెలిపాడు. అంతా వాళ్లే చేస్తారు. కానీ ఎదుటివారి మీద నిందలు వేస్తారని ఆరోపించాడు. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై ఇంకా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడీ వివాదం ఇక్కడితో ఆగుతుందా? ఎంతదూరమైనా వెళుతుందా? అనేది తెలీదు.