ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. విజయవాడలో అయితే పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. టిక్కెట్ దక్కని నేతల పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇదే బాటలో ఉన్నారు. ఆయన త్వరలో వైసీపీ గూటికి చేరిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. కేశినేని నాని గురువారం వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ లోపే సీఎం జగన్తో నాని భేటీకానున్నారు.
తనకు ఎంపీ టిక్కెట్ తోపాటు మరో 5 అసెంబ్లీ సీట్లను నాని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. విజయవాడ తూర్పులో తన కూతురు శ్వేతతోపాటు విజయవాడ పశ్చిమలో MS బేగ్, నందిగామలో కన్నెగంటి జీవరత్నం, తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో బొమ్మసాని సుబ్బారావుకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
నానికి ఎంపీ టిక్కెట్ తోపాటు ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇస్తోందని టాక్ నడుస్తోంది. మరి జగన్తో భేటీ తర్వాత ఎన్ని సీట్లు కేటాయిస్తారు..? నాని డిమాండ్ చేస్తున్నట్టు అవే స్థానాలను కేటాయించే అవకాశముందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
2014, 2018 ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నాని ఎంపీగా గెలిచారు. కొంతకాలంగా ఆయనకు టీడీపీ అధిష్టానంతో దూరం పెరిగింది. కేశినేని నాని సోదరుడు చిన్ని టీడీపీలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఆయన పార్టీ పెద్దలకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ముల మధ్య పొలిటికల్ గా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక తనకు ఇక టిక్కెట్ దక్కని తేలడంతో పార్టీ వీడాలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. అటు వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.