Ecuador: ఈక్వెడార్ రాజధాని గ్వయకిల్ లోని ఓ టీవీ ఛానెల్ బులిటెన్ ఆన్ ఎయిర్ లో ఉంది. న్యూస్ ప్రజెంటర్ వార్తలు చదువుతున్నాడు. సడెన్గా కొందరు దుండగులు గన్స్తో లోపలికి వచ్చి కలకలం సృష్టించారు. వారంతా మొఖాలు కనిపించకుండా మాస్క్ లు ధరించారు. కేవలం తుపాకులే కాదు.. డైనమైట్లు కూడా పట్టుకుని స్టూడియోలోకి ఎంటర్ అయి భయబ్రాంతులకు గురిచేశారు. వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడి ఉన్న స్టాఫ్ను కూడా బెదిరించారు. అక్కడే కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఇదంతా కూడా ఆ టీవీ ఛానెల్ లో దాదాపుగా 20 నిమిషాల పాటు లైవ్లో వచ్చింది.
ఆ తర్వాత పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఛానల్ బిల్డింగ్ను చుట్టుముట్టారు. పక్క భవంతులపైనుంచి స్నైపర్లు, టాక్టిక్ టీమ్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ వెపన్స్తో లోనికి చొచ్చుకుపోతున్నాయి. ఈ క్రమంలో స్టూడియోలోపల ఉన్న నిందితులకు భయం మొదలైంది. పారిపోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోలీసులు వారిని చుట్టుముట్టారు. మొత్తంగా 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని, ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవల జైళ్ల నుంచి ఇద్దరు డ్రగ్ గ్యాంగ్స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన అందులో భాగమే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్వెడార్లో గత కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కిడ్నాప్కు గురయ్యారు.గ్యాంగ్స్టర్లు తప్పించుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవా అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సైనిక బలగాల మోహరింపుకు ఆదేశాలు జారీ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు.