AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అన్ని పార్టీలు డబుల్ ఓట్లపై పోరాటం చేస్తున్నాయి. మరి వాటిని కనిపెట్టడం ఈసీకి సాధ్యమేనా? ఇంత తక్కువ సమయంలో డుప్లికేషన్ తొలగింపు వీలవుతుందా? పూర్తిస్థాయిలో బోగస్ ఓట్లను తీసేయడం సాధ్యమయ్యే పనేనా అన్న డౌట్లు వస్తున్నాయి.
ఏ రాష్ట్రంలో లేనంతగా.. అసలు ఈ దొంగ ఓటర్లను ఎవరు సృష్టిస్తున్నారు ? ఎందుకు సృష్టిస్తున్నారు? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. నిజంగా దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంటుందా ? ఇవన్నీ పెద్ద డిబేట్ కు కారణమవుతున్నాయి. విషయమేంటంటే టీడీపీ నేతలేమో ఇదంతా చేస్తున్నది వైసీపీ వాళ్లే అంటారు. సీన్ కట్ చేస్తే.. దీనంతటికీ కారణం టీడీపీ వాళ్లే అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూడ్డానికి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఈ పంచాయితీ ఇది వరకే ఢిల్లీ దాకా చేరింది. ఇప్పుడు సీఈసీ రాజీవ్ కుమార్ బృందం విజయవాడ రావడంతో ఇక్కడే తేల్చుకునే పనిలో పడ్డాయి ఏపీ పొలిటికల్ పార్టీలు.
ఏపీలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఈ దొంగ ఓట్ల వ్యవహారమే ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడిది సార్వత్రిక ఎన్నికలు. అందుకే సీన్ క్లైమాక్స్ కు చేరింది. ఒక దశలో ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘమే చెప్పిన సందర్భం. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2 లక్షల 51 వేల 767 ఓట్లు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఒకే డోర్ నెంబర్ తో పది ఓట్లకు పైగా దాదాపు 57 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయన్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఓటరు జాబితాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నది టీడీపీ వెర్షన్. కాదు కాదు.. 40 లక్షల 76 వేల 580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్పించారని ఒక సందర్భంలో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదంతా గోల్ మాల్ గందరగోళం అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఒక దగ్గర ఓటు ఉన్నా అదే సెగ్మెంట్ లో మరో చోట, మరో అడ్రస్ తో, మరో ఐడీతో, పేర్లలో అక్షరాలు మార్చి.. ఐడీ ప్రూఫ్ లను ట్యాంపర్ చేసి.. ఫోటోలు మార్చి, ఇంటి పేర్లు మార్చి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సానుభూతి పరులను చేర్చి.. డుప్లికేషన్ లో దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా దొంగ ఓట్లు నమోదు చేయించారన్నది అభియోగం. వైసీపీ నేతల అనుమానం ఏంటంటే.. మైడ్యాష్ బోర్డ్ డాట్ కామ్ పేరుతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటున్నారు. అమెరికా, లండన్ సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారని, పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ ఇది వరకే ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారంటున్నారు. అందుకే ఏపీ, తెలంగాణలో ఒకేరోజు పోలింగ్ పెట్టాలంటున్నారు.
దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి ఆ ఓట్లను తొలగిస్తున్న బూత్ లెవల్ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు ఫాం-7 దరఖాస్తులను బీఎల్ఓలకు టీడీపీ నేతలే ఇస్తూ.. కావాలనే తొలగించేలా చేస్తున్నారంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి.. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని, టీడీపీ చేసిన ఆ తప్పులను తాము సరిదిద్దామంటున్నారు సజ్జల.
అటు ఓటర్ ట్యాంపరింగ్ పై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35 వేలు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఏపీ బీజేపీ నేతలు ఇది వరకే ఎన్నికల సంఘానికి ఇచ్చారు. తిరుపతి బై పోల్ లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని.. అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని పురందేశ్వరి ఆరోపించారు. విశాఖపట్నం నార్త్లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61 వేల మంది ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని.. కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడమే మిగిలింది అంటున్నారు.
వందేళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో ఎక్కువగా ఉండటంతో అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఏపీలో జీరో డోర్ నంబర్తో 4 లక్షల 16 వేల 64 ఇళ్లున్నాయని చెబుతున్నారు. ఈ ఇళ్లల్లో ఓటర్లు భారీగా నమోదయ్యారంటున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు హస్తం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కాదు కాదు.. టీడీపీ చేసిన పనే ఇది అని తాము చాలా వరకు సవరించామని వైసీపీ అంటోంది. అందరి పోరాటం బోగస్ ఓట్లపైనే. మరి నిజం ఏంటన్నది ఈసీనే తేల్చాలి.
.
.