Singanamala MLA: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికల సైరన్ మోగనుంది. ఈ క్రమంలోనే నేతలంతా పూటకో రంగు మారుస్తూ నా మాటలు నా ఇష్టం అన్నట్టు ప్లేట్ తిప్పేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. కూడా ఈ రూట్ లోకే వచ్చారు. రెండు రోజుల క్రితం ఫేస్బుక్ లైవ్లో జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించిన ఆమె.. తాజాగా తాను తమ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా విమర్శలు చేయలేదంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. తన కోపం అధికారుల పైనే తప్ప.. పార్టీ అధినేతపై కాదని స్వరం మార్చడం హాట్ టాపిక్ గా మారింది.
ఫేస్బుక్ లైవ్లో ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలను ఓట్లు ఎలా అడగాలి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై, తన భర్తపై మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారని ధ్వజమెత్తారు. నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదని.. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన అనంతరం జొన్నలగడ్డ పద్మావతి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తన రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే ఉంటుందని.. ఆయన తనను సొంత చెల్లిలా చూసుకున్నారని తెలిపారు. తాను జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని.. అధికారులను మాత్రమే ప్రశ్నించినట్లు వివరించారు. తన మాటలను వక్రీకరించారని.. సీఎం జగన్ కు ఆపాదించి ప్రచారం చేశారని వాపోయారు. తాను మాట్లాడింది పార్టీకి, సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు ఎమ్మెల్యే పద్మావతి. జిల్లాస్థాయిలో అయిపోవాల్సిన ప్రతీ చిన్న పని కోసం కూడా సీఎం ఆఫీసుకి వెళ్లాల్సి వస్తోందన్న ఒక్క బాధ తప్ప మరొకటి లేదన్నారు. మొత్తానికి అయితే పద్మావతి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.