Arvind Alishetty: రాజకీయ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలు చూపించాడు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రభుత్వంలోని పెద్ద తలకాయలతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పాడు. అంతే.. మిడే మీల్స్ కాంట్రాక్ట్ పేరుతో ఓ దొంగ జీవో ఇచ్చి నాలుగు కోట్లు స్వాహా అనిపించాడు. ఇది బీఆర్ఎస్కు చెందిన ఓ నాయకుడి వ్యవహారం. బయటకు వచ్చిన ఉదంతం ఇలా ఉంటే.. బయటపడనివి ఎన్ని ఉంటాయో అని చర్చ జరుగుతోంది.
జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా పనిచేస్తాడు. బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ నాయకులతో ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వారందరితో తనకు పరిచయమని నమ్మించే ప్రయత్నం చేసేవాడు. ఆ ఫోటోలు చూసిన వాళ్లు కూడా వాస్తవంగానే ప్రముఖులతో ఆయనకి పరిచయం ఉందనే అనిపిస్తుంది. ఇలా ప్రచారం చేసుకుంటూ బంజారాహిల్స్లో బొల్లినేని ధనుష్ అనే ఓ వ్యాపారితో పరిచయం చేసుకున్నాడు.
ఆయనకి మిడ్ డే మిల్స్ పథకానికి సంబంధించిన కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. పాత జీవో కాపీలు తీసి వాటిని ఫోర్జరీ చేశాడు. కాంట్రాక్టు ఇప్పించినట్లు ప్రభుత్వం జీవో ఇచ్చాడు. కాంట్రాక్ట్ ఇప్పించినందుకు ధనుష్ దగ్గర 4 కోట్లు కమీషన్గా తీసుకున్నాడు. ఈ కాంట్రాక్టుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా దనుష్ పూర్తి చేసుకున్నాడు. కానీ.. వర్క్ ఆర్డర్స్ మాత్రం ప్రభుత్వం నుంచి రాలేదు. దీని గురించి అరవింద్ ను ప్రశ్నిస్తే.. జీవో ఇవ్వడం వరకే నా పని.. వర్క్ ఆర్డర్స్తో నాకు పని లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
గవర్నమెంట్ వర్క్ ఆర్డర్స్ ఇవ్వకపోతే నేనేం చేయాలని తిరిగి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు ధనుష్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో అసలు ప్రభుత్వం నుంచి ఇలాంటి జీవోలు రాలేదని తేలింది. ఇదో ఫేక్ జీవో అని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో.. సీసీఎస్ పోలీసులు అరవింద్ను అరెస్ట్ చేశారు. పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
.
.