Pragati Bhavan: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్లో కంప్యూటర్లు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ ఆ భవనాన్ని ఖాళీ తర్వాతే కంప్యూటర్లు మాయమైనట్టు గుర్తించారు. అయితే.. ఆ కంప్యూటర్లలో కీలక ఆధారాలున్నాయంటున్నారు అధికారులు. దీంతో కంప్యూటర్లు మాయం చేసింది ఎవరు..? మాయం చేయాల్సిన అవసరం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయా లేదా అన్నది పరిశీలిస్తున్నారు.
గత బీఆర్ఎస్ సర్కార్ పాలనపై కాంగ్రెస్, బీజేపీలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు గులాబీ నేతల అవినీతి చిట్టా బయటకు తీసి చంచల్గూడ జైలుకి పంపిస్తామంటూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ పదే పదే చెప్పినట్టుగానే అదే పనిలో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్. ఏ శాఖలో ఎన్ని అక్రమాలు జరిగాయి..? బీఆర్ఎస్ నేతలు దోచుకున్నదెంత అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రగతిభవన్ నిర్మాణం, నిర్వహణ ఖర్చుల లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. ఇదే సమయంలో ప్రగతిభవన్లో కంప్యూటర్లు మాయంకావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏదో మతలబుతోనే కేసీఆర్ ప్రగతిభవన్ను ఖాళీ చేయగానే కంప్యూటర్లు మాయమయ్యాయని అనుమానాలు కలుగుతున్నాయి. మరి కంప్యూటర్ల మాయం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందా..? లేదంటే దొంగల పనా అన్నది అధికారుల ఆరాలో తెలియాల్సి ఉంది.
.
.