TS E-Challan: గత ఏడాదికి పైగా చలాన్లు పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించేందుకు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాహనాల వారీగా రాయితీ శాతంతో చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించింది. ఇక, పెండింగ్లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ నేటితో ముగుస్తుంది.
గతంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి అక్కడిక్కడే పెనాల్టీ వేసి చలాన్లు వసూలు చేసేవారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ 2018 లో ఈ చలాన్ వ్యవస్థను అమలులోకి తీసుకు వచ్చింది. ఈ విధానంలో నిబంధనలను ఉల్లంగించిన వారికి వాహనదారుల ఫోటోలు తీసి పోలీసులు ఈ-చలాన్ విధిస్తున్నారు. వీటి చెల్లింపునకు ఆన్ లైన్లో తుది గడువు అంటూ ఏమి లేకపోవడంతో ఆన్ లైన్ పెనాల్టీ చెల్లింపుల బకాయిలు పేరుకుపోయాయి.
దీంతో పెండింగ్ చలాన్ల చెల్లింపుల కోసం రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాగా, పెండింగ్ పెనాల్టీలను ఆన్ లైన్లో చెల్లించేందుకు నేడు ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. జిల్లాలో భారీగా పెండింగ్ ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనదారులను ఆపి వారి పెండింగ్ చలాన్లు ఆన్ లైన్లో చెక్ చేసి ఎంత మొత్తం రాయతీ వస్తుందో చెబుతున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు తమ బకాయిలు వెంటనే ఈ చలాన్ వెబ్ సైట్ లో చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన బంపర్ ఆఫర్ను తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. ఇది వాహనదారులకు ఎంతో ఆదా అవుతోందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“సిరిసిల్ల జిల్లాలో ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాహనాదారులకు ఈ ఆఫర్ గురించి వివరిస్తే వెంటనే ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. రోజుకు దాదాపు 200 కు పైగా వాహనాల పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నాం. వాహనదారులు కూడా భారీగా రాయితీ ఉన్నందున బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలి” అని సిరిసిల్ల, ట్రాఫిక్ ఎస్ఐ రాజు తెలిపారు.