Fire Accident : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం శివారులో 63వ జాతీయ రహదారిపై ఇంధన ట్యాంకరు బోల్తాపడటంతో చెలరేగిన మంటలు 14 గంటలపాటు అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట పెట్రోల్ బంకుకు డీజిల్, పెట్రోల్ తీసుకొస్తున్న లారీ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవరు వెంటనే బయటకు రాగా.. ఒక్కసారిగా ఇంధన ట్యాంకరు నుంచి మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పలుమార్లు రసాయనాలతో కూడిన నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాద సమయానికి ట్యాంకరులో 18 వేల లీటర్ల డీజిల్, 4 వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్లు సమాచారం. దీంతో నిజామాబాద్ డివిజనల్ అగ్నిమాపక అధికారి మురళీమనోహర్రెడ్డి, అసిస్టెంట్ అధికారి భానుప్రతాప్, జగిత్యాల జిల్లా ఫైర్ అధికారి కొమురయ్య, మెట్పల్లి అగ్నిమాపక అధికారి మల్లికార్జున్యాదవ్ చేరుకొని సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
రెండు ఫైర్ ఇంజిన్లతో ఏకధాటిగా నీటిని చల్లడంతో రాత్రి 7 గంటలకు అగ్నికీలలు కొంత తగ్గడంతో వెంటనే క్రేన్ సాయంతో లారీని నిల్చోబెట్టారు. ట్యాంకర్కు రంద్రాలు చేసి ఇంధనాన్ని బయటకు పంపి నీరు చల్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పోలీసులు ఇతర మార్గాల్లో పంపించడం జరిగింది.
సంఘటనాస్థలికి 100 మీటర్ల దూరంలోనే ఓ పెట్రోల్ బంకు, దాన్ని ఆనుకునే బీసీ గురుకుల పాఠశాల ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. కాగా వెనుక టైర్ పగలడంతో లారీ అదుపుతప్పి బోల్తాపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ గుండెనొప్పితో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.