Extravagant BRS Govt | కేసీఆర్ ఏం చేసినా ఓ లెవెల్ ఉండాల్సిందే. ఎక్కడా తగ్గేదే లే.. ఇదే ఫార్ములా పట్టుకుని పని చేశారు తప్ప.. ఖజానాపై ఎంత దుబారా భారం పడుతుంది.. ఎంత వరకు ఉపయోగపడుతుందన్న లెక్కలను వేయలేదు. దీంతో అవసరం లేని వాటి భారం ఇప్పుడు జనం మోయాల్సిన పరిస్థితి ఎదురైంది. అట్లుంటది కేసీఆర్ తోని.. అనుకునేలా సీన్ కనిపిస్తోంది.
Extravagant BRS Govt | కేసీఆర్ ఏం చేసినా ఓ లెవెల్ ఉండాల్సిందే. ఎక్కడా తగ్గేదే లే.. ఇదే ఫార్ములా పట్టుకుని పని చేశారు తప్ప.. ఖజానాపై ఎంత దుబారా భారం పడుతుంది.. ఎంత వరకు ఉపయోగపడుతుందన్న లెక్కలను వేయలేదు. దీంతో అవసరం లేని వాటి భారం ఇప్పుడు జనం మోయాల్సిన పరిస్థితి ఎదురైంది. అట్లుంటది కేసీఆర్ తోని.. అనుకునేలా సీన్ కనిపిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ఏ పని కూడా సింపుల్ గా జరిగిపోలేదు. ఏమైనా అంటే ధనిక రాష్ట్రం.. ఈ మాత్రం ఖర్చు ఉండదా అన్నట్లుగా వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు అసలు తవ్వుతున్నా కొద్దీ ప్రజాధనం ఎంత వృధా అయిందో తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా అంటే తీసెయ్.. తోసెయ్ అన్నట్లుగానే చూస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్ లో ఫార్ములా–ఈ కార్ల రేస్ అగ్రిమెంట్ వెనుక పెద్ద కథే బయటికొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ లో ఉన్న ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్ గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న టైంలో కావడం, కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారని గుర్తించింది ప్రస్తుత ప్రభుత్వం. అసలే నిధుల కటకట ఉంటే ఈ కథంతా ఏంటన్నది చూస్తే అసలు కథ బయటికొచ్చింది. 55 కోట్లు ఎవరిని అడిగి ఈ ఫార్ములా రేస్ కు అడ్వాన్స్ ఇచ్చారో చెప్పాలంటూ అర్వింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో గత ఏడాది ఈ కార్ల రేసింగ్ ను నిర్వహించారు. దీని వల్ల సిటీ జనానికి చాలా ట్రాఫిక్ ఇక్కట్లు వచ్చాయి. వాటిని అప్పటి సర్కార్ లెక్కచేయలేదు. అప్పుడు రేసింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండీఏ 20 కోట్లు, రేస్ కు ప్రమోటర్ గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ దాదాపు 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్ తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్లు.. ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్ 9 ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండీఏ, నెక్స్ట్ జెన్, ఫార్ములా–ఈ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9 నిర్వహణ వల్ల హెచ్ఎండీఏకు గానీ, నెక్ట్స్ జెన్ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. 3 సీజన్లు నిర్వహిస్తే ఈ నష్టం 600 కోట్ల దాకా పెరిగి ఉండేది. అందుకే రేవంత్ సర్కార్ ఈ రేసింగ్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఫార్ములా– ఈ రేస్ సీజన్ 9 వల్ల నష్టం వాటిల్లినట్లు తేలినా.. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 నిర్వహణ కోసం గతేడాది అక్టోబర్ లో బీఆర్ఎస్ హయాంలోనే పచ్చ జెండా ఊపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్, స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రమోటర్ లేకుండా.. నేరుగా ఫార్ములా –ఈ కంపెనీతో హెచ్ఎండీఏ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేసుకు పెట్టే ఖర్చు, వాటిల్లే నష్టం మొత్తం హెచ్ఎండీఏపైనే ఉంటుంది. ప్రజాధనం వృథా అవుతుందని తెలిసినా.. ఆ కంపెనీకి ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ కు సంబంధించి 55 కోట్లు అడ్వాన్సుగా ముట్టజెప్పారు. ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.
ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయనని, చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారన్నారు. మరి ఖజానాపై భారం, ఫోన్ల మీదనే నిర్ణయాలు.. వివాదాల పరిష్కారాలు లండన్ కోర్టు పరిధిలో చూసుకోవాలన్న అగ్రిమెంట్ రూల్స్ ఇవన్నీ చాలా డౌట్లు పెంచుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే.. తాము అప్పుల కంటే ఆస్తులను సృష్టించి.. రాష్ట్రానికి అందించామని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ తొలి దఫాలో సీఎం అయినప్పుడు కాన్వాయ్ పై, బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై చాలా ఖర్చు చేశారు. తాజాగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతాననుకుని కేసీఆర్.. ముందుగానే 22 కొత్త ల్యాండ్ కూజర్ల వాహనాలు కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే చెప్పిన విషయం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వాటిని ప్రభుత్వ ఆస్తులు అంటారా.. అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటికే కాన్వాయ్ ఉండగా… 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు అంటే మాటలు కాదు… ఒక బండికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే.. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని సీఎం రేవంత్ అంటున్నారు.
ఇవే కాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ లీలలు అంతా ఇంతా కాదు.. రాజు తల్చుకుంటే కాని పనేముంటుంది? అన్నట్లుగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టు భర్తీ చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే బోయినపల్లి సరిత అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో జరిగిన నిర్ణయం మేరకు 2017 జూలై 29న అప్పటి జెన్కో సీఎండీ ప్రభాకర్రావు నియామక ఉత్తర్వులు జారీచేశారన్న విషయం తెరపైకి రావడం అది అటు తిరిగి ఇటు తిరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చుట్టుకోవడం కీలకంగా మారింది. రెండేండ్ల ప్రొబేషనరీ, కనీసంగా ఐదేండ్లు పనిచేయాలనే నిబంధనలతో తాత్కాలిక పద్ధతిలో నియమించినా.. ఏరోజూ రాకుండా జీతం పొందడం, అధికార దుర్వినియోగం, నిధుల దుబారాకు మరో నిదర్శనం అంటున్నారు. ఇలాంటి వారు ఎన్ని డిపార్ట్ మెంట్లలో ఇంకెంత మంది ఉన్నారోనన్న చర్చ కూడా జరుగుతోంది.