అర్జున అవార్డు అందుకోవడంతో నా కల నెరవేరిందని మహ్మద్ షమీ అన్నాడు. రాష్ట్రపతి భవన్ లో ఘనంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది తమ జీవిత కాలంలో ఈ అవార్డును అందుకోలేకపోయారని అన్నాడు. అలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నాడు. తన కల సాకారమైందని సంతోషంతో తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన షమీ…అదే స్పీడులో అర్జున అవార్డుని కూడా అందుకున్నాడు. భారతదేశంలో క్రీడాకారులకిచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. హార్దిక్ పాండ్యా గాయంతో ఆటకి దూరం కావడంతో మహ్మద్ షమీకి అవకాశం వచ్చింది. రావడం, రావడమే నిప్పులు కురిపించే బంతులతో చెలరేగి, టోర్నమెంట్ మొత్తమ్మీద 24 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్, తెలుగువాడైన అజయ్ కుమార్ సైతం అర్జున అవార్డును అందుకున్నాడు. అలాగే బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి, సాత్విక్రాజ్ రంకిరెడ్డికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కింది.
2023 సంవత్సరానికి మొత్తం 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లభించింది. సాత్విక్ తోపాటు అర్జున అవార్డు అందుకున్న అజయ్ కుమార్ సైతం ఆంధ్రప్రదేశ్కు చెందినవారే కావడం విశేషం. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ కూడా అర్జున అవార్డు అందుకున్నాడు.
గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. చిన్నతనంలో కంటి చూపు కోల్పోయాడు. 2010లో భారత జట్టులో చోటు దక్కించుకున్న తను.. 2012లో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్, 2014లో జరిగిన అంధుల వరల్డ్ కప్ లను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అర్జున అవార్డు పొందినవారు వీరే…
ఆర్చరీ నుంచి… ఒజాస్ ప్రవీణ్, అదితి గోపీచంద్ స్వామి
అథ్లెటిక్స్ నుంచి.. శ్రీశంకర్, పారుల్ చౌదరి
బాక్సింగ్ నుంచి… మహ్మద్ హుసాముద్దీన్
చెస్… వైశాలి
ఈక్వెస్ట్రియన్ ప్లేయర్… దివ్యకృతి సింగ్
గోల్ఫ్ నుంచి దీక్షా దగర్ ఉన్నారు.
వీరు కాకుండా హాకీ క్రీడాకారులు కృష్ణ బహదూర్, సుశీలా చానులు అర్జున అవార్డు గెలుచుకున్నారు.
కబడ్డీ ప్లేయర్స్ పవన్ కుమార్, రితూ నేగీ
ఖో ఖో క్రీడాకరుడు నస్రీన్ కూడా అర్జున పొందారు.
లాన్ బౌల్స్ నుంచి పింకి
షూటింగ్ క్రీడాకారులు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్,ఈశా సింగ్
స్క్వాష్ నుంచి… హరిందర్ పాల్ సింగ్ సంధూ
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అహ్యిక ముఖర్జీ,
రెజ్లింగ్ యోధులు అంతిమ్ పంగల్, నరోమ్ రోషిబినా దేవిలు కూడా అర్జున గ్రహీతలుగా ఉన్నారు.
పారా అర్చరీ నుంచి శీతల్ దేవి, అంధుల క్రికెట్ నుంచి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, పారా కనోయింగ్ ఆడుతున్న ప్రాచి యాదవ్లకు అర్జున దక్కాయి.
ద్రోణాచార్యులు వీళ్లే…
ఆర్.బి. రమేశ్ – చెస్
మహవీర్ ప్రసాద్ సైని – పారా అథ్లెటిక్స్
లలిత్ కుమార్ – రెజ్లింగ్
శివేంద్ర సింగ్ – హాకీ
గణేష్ ప్రభాకర్ – మల్లఖంబ్
ద్రోణాచార్య అవార్డులలో… లైఫ్ టైమ్ కేటగిరీ అవార్డులలో కబడ్డీ కోచ్ భాస్కరన్, గోల్ఫ్ కోచ్ జస్క్రిత్ సింగ్ గ్రెవాల్, టేబుల్ టెన్నిస్ కోచ్ జయంత కుమార్ పుషిలాల్ ఉన్నారు.
ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు..
కవితా సెల్వరాజ్ – కబడ్డీ
మంజూష కన్వర్ – బ్యాడ్మింటన్
వినీత్ కుమార్ శర్మ – హాకీ