Fatima Sheikh : మన దేశపు తొలి మహిళా టీచర్గా పేరొందిన సావిత్రీబాయి ఫూలే గురించి మనందరికీ తెలుసు. కానీ.. సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా సావిత్రీ బాయి పూలే చేసిన కృషిలో నేనున్నాను అంటూ అండగా నిలిచిన మరో గొప్ప మహనీయురాలి గురించి మాత్రం మన సమాజం మరిచిపోయింది. ఆవిడే.. ఫాతిమా షేక్. నేడు ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం.
పూణె నగరంలోని ఓ దళితవాడలో 1848లో జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలను ప్రారంభించారు. ముందుగా తన భార్య సావిత్రి చేతనే అక్షరాలు దిద్దించారు. దీనిని నాటి సమాజం అంగీకరించకపోవటంతో.. పూలే తండ్రి ఈ పనులు మానుకోవాలని, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. దీంతో జ్యోతిబా పూలే స్నేహితుడైన ఉస్మాన్ షేక్.. ఆ దంపతులకు తన ఇంటి ప్రాంగణంలోనే బడి నడుపుకునే అవకాశం ఇవ్వటమే గాక.. సావిత్రితో బాటు తన చెల్లి ఫాతిమాకూ చదువకు చెప్పాలని కోరాడు. అనతికాలంలోనే సావిత్రితో పోటీపడి ఫాతిమా చదవటం, రాయటం, లెక్కలు వేయటం నేర్చుకున్నారు. ఈ బడికి మంచిపేరు రావటంతో క్రమంగా పిల్లల సంఖ్య పెరగటంతో సావిత్రి, ఫాతిమాలు మరో బడిని ప్రారంభించి ఇద్దరూ బోధించేవారు.
బహుజనులు, దళితులకు పాఠాలు చెబుతున్న వీరిపై నాటి అగ్రవర్ణాలతో బాటు కొందరు ముస్లిం పెద్దలు సైతం ఫాతిమాను హెచ్చరించారు. అయినా ఫాతిమా వాటిని పట్టించుకోకుండా విద్యాబోధనను కొనసాగించింది. దీంతో ఆమె ఎన్నో వెక్కిరింతలు, నిందలను భరించాల్సి వచ్చింది. కొన్నిసార్లు దారిలో వెళుతుండగా ఆమె మీద రాళ్లు కూడా విసిరేవారు. పాఠశాలకు వెళ్తుంటే చెత్తపోయటం, పేడ కళ్లాపి చల్లటమూ చేసేవారు. బట్టలు పాడైపోయి, కంపు కొడుతున్నా.. ఫాతిమా బడికి వెళ్లి అక్కడే పెట్టుకొన్న వేరే బట్టలు కట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పేవారు తప్ప వెనకాడలేదు.
ఈ ఘటనలు ఆమెలో మరింత పట్టుదల పెంచాయి. బడి సమయం తర్వాత ఇంటింటికీ వెళ్లి.. బాలికల చదువు ఎంత ముఖ్యమో వివరించేవారు. దీంతో ఆమె బడికి మరింత మంది దళిత, బహుజన బాలికలు రావటం మొదలయింది. సావిత్రీ బాయి సహాధ్యాయిగా మొదలైన ఫాతిమా.. ఈ దేశపు తొలి ముస్లిం టీచర్గా విశేష సేవలందించారు. సావిత్రీబాయి ప్రారంభించిన 5 స్కూళ్లలోనూ ఫాతిమా పనిచేశారు. అంతేకాదు.. 1851లో ముంబైలో ఆమె సొంతగా 5 బాలికల స్కూళ్లను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాతిమా షేక్ సేవలను గుర్తించి.. ఎనిమిదవ తరగతి సిలబస్లో ఫాతిమా పాఠాన్ని చేర్చింది. 171 సంవత్సరాల క్రితం అణగారిన బాలికల విద్యకోసం అహరహం పరితపించిన ఫాతిమా షేక్ జీవితంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళి.