Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారని హయత్నగర్ సర్కిల్ వాల్యుయేషన్ అధికారిపై వేటు వేసింది. సోమవారం బాలానగర్లో రోడ్డుపై ప్రజపాలన దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. డేటా ఎంట్రీ కేంద్రానికి తరలిస్తుండగా ఈ పత్రాలు రోడ్డుపై పడ్డాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులుగా హయత్నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కొత్త ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురైయ్యారు. ఈ ఘటన బాలానగర్లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్న సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ పై పడ్డాయి. ఆ వాహనదారుడు కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా.. స్థానికులు దరఖాస్తులను గమనించి వాహనదారుడుని నిలదీశారు. హయత్ నగర్ సర్కిల్కు చెందిన దరఖాస్తులు.. బాలానగర్లో ఎందుకు ఉన్నాయని స్థానికులు ప్రశ్నించారు.
దీంతో అతను ర్యాపిడో బుక్ చేయగా తాను కేవలం వాటిని ఓ చోటు నుంచి మరో చోటుకు తరలిస్తునన్నానని తెలిపాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయి. వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అనంతరం ఆ పత్రాలు బయటకి వచ్చిన కారణాలు తెలుసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు హయత్నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.