కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే ప్రమాదమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు కేటీఆర్.
పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందేనని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని కేటీఆర్ గుర్తుచేశారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారని.. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండంటూ కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజవర్గాలకు 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక్క భద్రాచలం నియోజవర్గంలో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాపైనే కేటీఆర్ దృష్టి పెట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. ఈ సారి కూడా అదే ఫలితాన్ని పునరావృత్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతోంది.