Saif Suspension: మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్కు మరోసారి షాక్ తగిలింది. లాయర్ల సమక్షంలో విచారణ జరిపిన యాంటి ర్యాగింగ్ కమిటీ ..సైఫ్పై సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీతి సూసైడ్ తర్వాత ఏడాది కాలం పాటు తరగతులకు.. హాజరు కావద్దంటూ అప్పట్లో కమిటీ సస్పెన్షన్ విధించింది. దాన్ని కోర్టులో సవాల్ చేశాడు సైఫ్. అయితే.. సైఫ్ను క్లాసులకు అనుమతిస్తూ మరోసారి విచారణ చేయాలంటూ న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. మధ్యలో 97 రోజులపాటు క్లాసులకు హాజరయ్యాడు.
సుదీర్ఘ విచారణ తర్వాత సంవత్సరం పాటు సస్పెన్షన్ ను కమిటీ రీ కన్ఫర్మ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్ పై విధించిన సస్పెన్షన్ మార్చి 3తో ముగియనుండగా.. మరో 97 రోజులపాటు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మరణం అనంతరం.. సైఫ్ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో ర్యాగింగ్ కమిటీ అతనిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.