Mohammed Shami : టీమ్ ఇండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా ఒకొక్కరూ గాయాల బారిన పడుతున్నారు. పడినవాడు మళ్లీ లేవడం లేదు. ఒక నెల రెండు నెలలు కాదు, ఏకంగా ఆరేసి, ఏడేసి నెలలు మంచం మీద ఉండిపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కి ఆపరేషన్ తప్పడం లేదు. ఇక టీమ్ ఇండియాకి వన్డే వరల్డ్ కప్ 2023 దెబ్బ మామూలుగా తగల్లేదు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు.
తర్వాత మహ్మద్ షమీ పరిస్థితి అలాగే ఉంది. బెంగళూరులోని ఎన్ సీఏ పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేదు. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ టూర్ లో కూడా ఆడటం లేదు. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లకి కూడా అందుబాటులో ఉండడని బాంబ్ పేల్చారు.
దీంతో మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై పేస్ భారం పడనుంది. వీరిద్దరూ ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లతో చెలరేగితే, రెండో ఇన్నింగ్స్ లో ఆ భారాన్ని బూమ్రా మోశాడు.తను 6 వికెట్లు తీసుకున్నాడు.
ఇప్పుడు వీరికి షమీ తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది. ఏదేమైనా జూన్ నాటికి పొట్టి వరల్డ్ కప్ ప్రారంభమయ్యే సమయానికి గాయాలతో బాధపడుతున్న మహ్మద్ షమీ, పాండ్యా, సూర్య కుమార్ అందరూ కోలుకుని అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుతున్నారు.
ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ 2023లో ఈ ముగ్గురి బౌలింగ్ కాంబినేషన్ తోనే ఫైనల్ వరకు టీమ్ ఇండియా చేరుకోగలిగింది. అందుకే వీరందరూ మళ్లీ టీ 20 వరల్డ్ కప్ సమయానికి అందుబాటులోకి రావాలని, ఆ కాంబినేషన్ పునరావృతం కావాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది.
అలాగే వన్డే వరల్డ్ కప్ చివరిలో బోల్తా కొట్టిన రోహిత్ సేన ఈసారి ఎలాగైనా టీ 20 ప్రపంచకప్ నైనా గెలిచి భారతీయుల మనసులు గెలచుకోవాలని పట్టుదలగా ఉంది. వీరు గాయాల నుంచి కోలుకొని, ఆ కలను నెరవేరుస్తారని ఆశిద్దాం.